December 11, 2023

చంద్రగిరి శిఖరం

స్వతహాగా ప్రకృతి ఆరాధకుడైన బిభూతి భూషణ్ ఈ నవలలో ప్రకృతి సౌందర్యాన్ని, దానిలోని విలయాలను, వింతలను, విశేషాలను పాఠకుల కళ్ళకు కట్టినట్టు వర్ణించారు. భావుకుడూ, సాహసికుడూ అయిన ఒక బెంగాలీ యువకుడు ఆఫ్రికన్ అరణ్యాల్లో చేసిన సాహస యాత్రను వర్ణించిన నవల ఇది. ఐతే కేవలం కాలక్షేపాన్ని అందించే సాహసగాథల వంటిది కాదు ఈ రచన. విస్తృతమైన జీవితానుభవాలూ, ప్రకృతితో సాన్నిహిత్యమూ మానవ స్వభావాన్ని ఎంత ఉన్నతీకరిస్తాయో అతి సున్నితంగా చిత్రించాడు రచయిత. పూల వనాలూ, కీకారణ్యాలూ, వెన్నెల రాత్రులూ, కార్చిచ్చు జ్వాలలూ, జలపాతాలూ, అగ్నిపర్వతాలూ... ప్రకృతిలోని ప్రతి అంశాన్నీ మానవజీవితంలోని వెలుగునీడలంత సహజంగా స్వీకరించి, ప్రేమించగలడాయన. ఈ తాత్వికతే ఆయన రచనలకు గొప్ప గాఢతనూ, సౌందర్యాన్నీచేకూర్చింది.

బిభూతి భూషణ్ బందోపాధ్యయ

తెలుగు అనువాదం కాత్యయని

చంద్రగిరి శిఖరం ఈ పుస్తకాన్ని చిన్నదని తక్కువ పేజీలే ఉన్నాయనీ లెక్కకట్టుకుని చేతిలోకి తీసుకునే పాఠకుడికి చదువరిని నరాలు బిగబెట్టి కాలాన్ని వెనక్కు నెట్టి చదివించగల సత్తా ఈ పుస్తకానికి ఉంది. చాలా పుస్తకాల్లో అసలు కథను మధ్యలోకి వెళితేనే కానీ పట్టుకోలేము.. కానీ చంద్రగిరి శిఖరం మొదటిపేరాలోనే మనల్ని సాహసం వైపుగా నడిపిస్తుంది. చదివే ప్రతిపేరా నరాలను బిగిస్తుంది.

బిభూతి భూషణ్ గారు బెంగాలీలో ప్రముఖ రచయిత. పదహారుకు పైగా నవలలూ, రెండొందల పైచిలుకు కథలూ రచించాడు. వాటిలో బాగా ప్రసిద్ధి పొందినవి “పథేర్ పాంచాలి”, “అపరాజితో”, “వనవాసి” అనే మూడు నవలలు. ఇవన్నీ ఇదివరకే తెలుగులో వచ్చాయి. వీటిలా ఆత్మకథాత్మకంగా కాక, కాల్పనిక శైలిలో రచించిన “చంద్రగిరి శిఖరం” (చందే పహార్) కూడా కాత్యాయని అనువాదంతో తెలుగులో వచ్చింది. ప్రకృతి సౌందర్యాన్ని దర్శించటంలో రచయిత బిభూతి భూషణ్ దొక విలక్షణమైన దృష్టి.  ప్రకృతిలోని అన్ని పార్శ్వాల్లోనూ, అన్ని శక్తుల్లోనూ వ్యక్తమయ్యే సౌందర్యాన్ని ఆస్వాదించి పాఠకుల అనుభూతికి అందించగలడాయన.

స్వతహాగా ప్రకృతి ఆరాధకుడైన బిభూతి భూషణ్ ఈ నవలలో ప్రకృతి సౌందర్యాన్ని, దానిలోని విలయాలను, వింతలను, విశేషాలను పాఠకుల కళ్ళకు కట్టినట్టు వర్ణించారు. భావుకుడూ, సాహసికుడూ అయిన ఒక బెంగాలీ యువకుడు ఆఫ్రికన్ అరణ్యాల్లో చేసిన సాహస యాత్రను వర్ణించిన నవల ఇది. ఐతే కేవలం కాలక్షేపాన్ని అందించే సాహసగాథల వంటిది కాదు ఈ రచన. విస్తృతమైన జీవితానుభవాలూ, ప్రకృతితో సాన్నిహిత్యమూ మానవ స్వభావాన్ని ఎంత ఉన్నతీకరిస్తాయో అతి సున్నితంగా చిత్రించాడు రచయిత.

పూల వనాలూ, కీకారణ్యాలూ, వెన్నెల రాత్రులూ, కార్చిచ్చు జ్వాలలూ, జలపాతాలూ, అగ్నిపర్వతాలూ… ప్రకృతిలోని ప్రతి అంశాన్నీ మానవజీవితంలోని వెలుగునీడలంత సహజంగా స్వీకరించి, ప్రేమించగలడాయన. ఈ తాత్వికతే ఆయన రచనలకు గొప్ప గాఢతనూ, సౌందర్యాన్నీచేకూర్చింది.

కథా విషయం:— శంకర్ ఓ పల్లెటూరి కుర్రవాడు. చదువు పూర్తి చేసుకొని గ్రామానికి వస్తాడు. కుటుంబ పరిస్థితుల వల్ల కెన్యాలోని మెుంబాసా దగ్గర రైల్వేశాఖలో గుమస్తాగా పనిలో చేరతాడు. అత్యంత ప్రమాద భరితమైన ఆ ప్రాంతం మానవుని రక్తాన్ని మరిగిన సింహాలకు నిలయమని తెలుసుకుని అక్కడికి ముఫ్పై మైళ్ల దూరంలోని కిసుమూ రైల్వే స్టేషన్‌కి స్టేషన్ మాస్టరుగా కొత్త ఉద్యోగంలో చేరతాడు. అక్కడ జనసంచారం తక్కువ. ఒక రోజు ఆ అటవీ ప్రాతంలో ఒక పోర్చుగీసు యాత్రికుడు డిగో అల్వరేజ్ అపస్మారక స్థితిలో కనిపిస్తాడు. శంకర్ అతణ్ని బతికిస్తాడు. అతను వజ్రాలకై తాను చేసిన సాహసయాత్రను గురించి చెప్తాడు. సాహసయాత్రలంటే మక్కువ గల శంకర్ అతనితోపాటూ తానూ సాహసయాత్రకు సిద్ధపడతాడు. ఇద్దరూ వజ్రాల కోసం ఆఫ్రికా అటవీ ప్రాంతంలోని చందేర్ పహార్ చేరుకుంటారు. ఈ యాత్రలో వారు దట్టమైన అడవుల్నీ, వింత జంతువుల్నీ, పక్షుల్నీ, సెలయేళ్ళనీ, వర్షాలు వరదలూ తుఫాన్లనీ, ఎడారుల్నీ… ఎన్నింటినో దాటుకు సాగుతారు. అగ్నిపర్వతం పేలడం కూడా తమ కళ్ళతో చూస్తారు. ఏన్నో కష్టాలతో సాగిన ఈ యాత్రలో శంకర్ వజ్రాలగనిని చేరాడాలేదా అనే దాని కన్నా, అతడు ఆ భయంకర పరిస్థితుల నుండి ప్రాణాలతో బయటకు రాగలడా అనే ఉత్కంఠే మనకు ఎక్కువ కలుగుతుంది. 

బిభూతి భూషణ్ గారి శైలి సరళంగా సాగుతుంది. ప్రకృతి వర్ణనలు స్వయంగా అనుభవించి రాసినవిగా స్వచ్ఛంగా ఉంటాయి. ఆశ్చర్యం ఏమిటంటే తాను ఎరిగిన బెంగాల్ సరిహద్దులతో పాటూ, తాను ఎప్పుడూ చూడని ఆఫ్రికా అరణ్యాల అందాలను, అందులోని ప్రమాదాలను ఎంతో మనోహరంగా వర్ణించటం. ఆయన శైలికి ఒక మచ్చుతునకగా ఈ భాగాన్ని ఉదహరిస్తాను:

“ఎంతటి భయంకరమైన దృశ్యమది! వాళ్ళిద్దరూ ఆ వైపునుండి కళ్ళు తిప్పుకోలేకపోయారు. నిప్పు ముద్దల్లా ఉన్న మేఘాలు కిందికి దిగి అగ్ని పర్యతపు ముఖ భాగాన్ని సమీపించి, మరుక్షణంలోనే అగ్నిజ్యాలలుగా మారి వెయ్యి అడుగుల ఎత్తుకు ఎగిసి పడుతున్నాయి. ఆ పగలూ, రాత్రీ కూడా అగ్ని పర్వతం మీదనుండి బాణాసంచా పేలుస్తున్న వెలుగులాంటిది కనబడుతూనే ఉంది. ఆ పర్వతం కింది భాగాన ఉన్న లోయలోని పెద్దపెద్ద వృక్షాలన్నీ రాళ్ల వర్షంతోనూ, అగ్నిజ్యాలలతోనూ ధ్యంసమయ్యయి. రాత్రి బాగా పొద్దుపోయాకా మళ్ళీ ఒకసారి పర్యతం బద్దలై నిప్పులు చిమ్మే అద్బుత దృశ్యం ప్రత్యక్షమైంది. ఆ మంటల వెలుగు, కనుచూపు మేరదాకా అడవికంతటికీ రుధిరవర్ణం పులిమింది. రాళ్ళవర్షం మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. అగ్ని పర్వతపు అరుణ వర్ణాన్ని ప్రతిఫలిస్తున్న ఆకాశంలో నిప్పు కణికల్లా మెరుస్తున్నాయి మేఘాలు.”

దృశ్యాన్ని తెచ్చి ముందు నిలిపే ఇలాంటి ప్రకృతివర్ణనలతో పాటూ, ఊహాశక్తికి పదును పెట్టే కథనం మనలో ఉత్కంఠను రేకెత్తించి కథలో లీనం చేస్తుంది. మన ఆలోచనల్లో ఆ ప్రాంతాలను, ఆ ప్రకృతినీ చిత్రించుకుంటూ చదువుకుంటూ పోతాం. కథనం ఆద్యంతం ఒక సినిమాను చూస్తున్న అనుభూతిని కలిగిస్తూ సాగుతుంది. ఆ సాహస యాత్రలో, ఆ ప్రమాదాల మధ్య మనమూ ఉన్నామా అనే భ్రమను కలగజేస్తుంది.

బిభూతి ఇతర నవలల్లోగా, పేరా పేరా కూ పాఠకుడు ఆ “అనుభూతిస్తూ”, మైమరపుకు చేరుకునేలా లేదీ పుస్తకం. పేరా పేరాకూ ఒక స్వప్నం,  వెను వెంటనే  ఒక నిజానుభవం, ఓ జలదరింపు, ఆసక్తి కలిగించే వర్ణనా.. దట్టమైన రెయిన్ ఫారెస్ట్ లో కాలు జారే ప్రాంతాల్లో, ఆ ఆకుల వాసనా, జంతువుల అరుపులూ, వాటి విచిత్ర అలవాట్లూ, పాములూ, కొండ చిలువలూ, హైనాలూ, చిరుతలూ.. జిరాఫీలూ వీటన్నిటి మధ్యా మనమూ నడుచుకుంటూ, భయపడుతూ, వెళ్తూ ఉంటాము. అనువాదం చాలా బావుంది. అనువాదకురాలు కాత్యాయని గారి శైలి సరళంగా ఉండి ఎక్కడా అనువాదంగా తోచలేదు. అచ్చ తెలుగు కథగానే అనిపించింది.

%d