ఏది పట్టుకున్నా కరోనా భయంతో వణికిపోతున్న రోజులివి.. గత సంవత్సరాలు వినాయకచవితి, దసరా, దీపావళి ఇలా అన్ని పండుగలు ఎంతో ఘనంగా చేసుకున్నాం. అయితే ఇప్పుడు కరానా కాలంలో మొన్న వచ్చిన బోనాల పండుగను కూడా సరిగా జరుపుకోలేకపోయాం.. ఇప్పుడు పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. వినాయక చవితి అంటే తెలుగు రాష్ట్రాలలోను ముఖ్యంగా మన హైదరాబాద్ లో జరిగే హఢావుడి అంతా ఇంతా కాదు. మరిప్పుడు కరోనా భయంతో పరిస్థితి అతలాకుతలం అయిపోయింది. అంతే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచీ వచ్చి ఇక్కడ వినాయక విగ్రహాలను తయారుచేసి విక్రయించే వలస కార్మికులు ఈ కరోనా విలయానికి సొంత రాష్ట్రాలకు వెళిపోయారు. ఈ పరిస్థితుల్లో వినాయక చవితి జరుపుకోవాలంటే మన చేతులకు పని చెప్పాల్సిందే.. మన ఇంట్లోనే మట్టి గణపతులను తయారు చేసుకుని పూజించడమే మంచిది.
కరోనా కాలంలో వస్తున్న ఈ వినాయక చవితి మరికాస్త శ్రద్ధగా ప్రజలు జరుపుకోవలసిన పరిస్థితి. కరోనా విలయతాండవానికి ప్రపంచం అంతా చిగురుటాకులా వణికిపోతూ వస్తుంది. ఇలాంటి పరిస్థితిల్లో.. ఈ నెల 22న వస్తున్న వినాయక చవితిని తెలుగువారంతా ఏలా జరుపుకుంటారనేది ఆలోచిస్తే.. అంతటి సంబరాలు ఇప్పుడు ఉండకపోవచ్చు.. అంతటి ఆర్భాటాలు ఇప్పుడు జరగకపోవచ్చు.. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు సంబరాలను జరుపుకునేలా ఆలోచించడమే సరైన మార్గం. అటు సామాజిక దూరాన్ని పాటిస్తూ, సానిటైజర్ ను ఉపయోగిస్తూ ఈ చవితి గణపతిని కరోనా నుంచీ యావత్ భారతావనిని కాపాడమని వేడుకుందాం.
వినాయక చవితి పదిరోజులు ఉందనగా నగర రోడ్లకు ఇరువైపుల రంగు రంగుల ఎన్నో ఆకారాలతో గణపతి రూపాలు అలరిస్తూ ఉంటాయి. ఎవరికి కావలసిన విగ్రహాలను వారు తీసుకెళుతూ రోడ్లన్నీ రద్దీగా మారుతూ అందంగా ఉండేది.. మరిప్పుడు ఎంతో కష్టించి వలస వచ్చి విగ్రహాలను తయారుచేసే పక్కరాష్ట్రాల కార్మికులు తిరిగి నగరాలకు రాకపోవడం ఇవన్నీ కూడా వస్తున్న వినాయక చవితి మీద ఆశలు వదులుకునేలా చేస్తుంది. అంతేనా ఏది పట్టుకున్నా ముట్టుకున్నా అంటుకుంటుందేమోననే ఈ కరోనా అభద్రతా భావం మనుషులన్ని భయంతో చంపేస్తుంది. నలుగురితో కలిసి గడపలేని పరిస్థితి,,.. మరి చవితి సంబరాలు ఒంటరిగా జరుపుకునేవి కాదాయే.. పెద్ద పెద్ద షెడ్లలో షామియానా పరిచి, రంగురంగుల అలంకరణలతో పెద్ద గణపతిన ప్రతిష్టించి.. తొమ్మిది రోజులు పూజా పునస్కారాలతో.. డిజే పాటలతో మారుమోగిపోయేవి వీధులు. సంబరాలు, ప్రసాదాలు.. భక్తుల కోలాహలం మధ్య తొమ్మిదిరోజుల సంబరాలలో చివరిలో ఊరేగింపులు, నిమజ్జనం ఇంతా ఇప్పుడు కుదురుతుందా..
ఇప్పటి పరిస్థతిలో కరోనా వలయంలో చిక్కుకోకుండా ఉండాలంటే ఈ ఏడు ఉన్నదాంట్లోనే చవితిని జరుపుకుంటూ మట్టితో ప్రతిమలను ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు తయారు చేసుకుని పూజించటమే సరైన మార్గం.. దేశమంతా కష్టకాలంలో ఉంది. వినాయక సంబరాలు ప్రతి గ్రామాన్ని.. నగరాన్ని ఆనందంలో కన్నుల పండుగగా జరిగేవి.. హైదరాబాద్ లో ఖైరతాబాద్ వినాయకుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేద్దు.. అలాంటిది ఈ సంవత్సరం ఆ ఉత్సవం కూడా మనకు లేనట్టే… ఈ పరిస్థితిలో అంతా తమ తమ ఇళ్ళల్లో మట్టి వినాయకుడిని తయారు చేసుకుని పూజించడం ఎంతో మేలు…
ఇదిగో వినాయకుడి మట్టి విగ్రహాన్ని మీ ఇంట్లోనే ఇలా తయారు చేయండి…
1. మట్టిని, నీటిని తగినంత తీసుకుని కలిపి ముద్దగా విగ్రహం తయారీకి అనువుగా ఉండేలా కలుపుకోవాలి.
2. మట్టి ముద్దతో 3 పెద్ద సైజ్ ముద్దలను, 4 పొడవైన ముద్దలను, మరో 4 చిన్నసైజ్ ముద్దలను తయారు చేసుకోవాలి. 3 పెద్ద సైజ్ ముద్ధలతో బేస్, బాడీ, తలను తయారు చేయాలి. 4 పొడవైన ముద్దలతో కాళ్లు, చేతులు, మరో 4 చిన్నసైజ్ ముద్దలతో తొండం, చెవులను తయారు చేసుకోవాలి.
3. ముట్టి ముద్దను పెద్దగా కలుపుకుంటే విగ్రహాన్ని కూడా పెద్దగా తయారు చేసుకోవచ్చు.
4. వినాయకుడి కళ్లకు బదులుగా తులసి విత్తనాలను ఆ స్థానంలో పెట్టుకోవచ్చు.
5. పసుపు, కుంకుమ లేదా ఇతర సహజసిద్ధమైన రంగులను అవసరం అనుకుంటే వినాయకుడికి అలంకరణ కోసం ఉపయోగించవచ్చు.
అయితే వినాయకుడి విగ్రహం కళాకారులు తీర్చిదిద్దినట్లుగా చక్కని ఆకృతిలో రాలేదని దిగులు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన ఆకారం వచ్చేట్టుగా ఒక మోస్తరుగా విగ్రహాన్ని తయారు చేసుకున్నా చాలు.. గణపతి విగ్రహాన్ని నిరభ్యంతరంగా పూజించుకోవచ్చు. ఇక కచ్చితంగా చక్కని ఆకృతిలో వినాయకుడి విగ్రహం రావాల్సిందే.. అనుకుంటే.. కొంచెం ఎక్కువ శ్రమ పెట్టాల్సి ఉంటుంది. అటు పర్యావరణాన్ని ఇటు కరోనాను జయించాలంటే మనం సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇళ్ళల్లోనే మట్టి విగ్రహాలను ప్రతిష్టిద్దాం… ఈ విషయంపై అందరిలోనూ అవగాహనను తీసుకురావాలి.. చిన్న వీధుల నుంచి, పెద్ద పెద్ద మార్కెట్ వీధులు, అపార్ట్ మెంట్లు గుడి ప్రాంగణాలలో వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజించడం అలవాటు పడిపోయిన భక్తులు ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఈ సమస్యలో పండుగను జరుపుకుంటారో చూడాలి.
More Stories
బామ్మ కథ “బంగారు మురుగు”
చంద్రగిరి శిఖరం
రేడియో హీరోయిన్ శారదా శ్రీనివాసన్….